A disturbance of corona cases in nizamuddin religious meet:
విదేశాలనుంచి వచ్చిన వారి నుంచే ఎక్కువగా కరోనా వైరస్ వచ్చిందన్నది నిజం. అయితే విదేశాల నుంచి వచ్చిన వారితో కలిసి దేశ వ్యాప్తంగా ఏదైనా పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారా? ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారు దేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు అనే అంశానికి సంబంధించిన వార్నింగ్ బెల్ మోగింది. గత శుక్రవారం రాత్రి వేళలో లకడ్డీకాపూల్ లోకి ఒక ప్రైవేటు ఆసుపత్రి నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో వైద్య అధికారులు అలెర్ట్ అయ్యారు. ఒక పెద్ద వయస్కుడు మరణించారని.. ఆయన ఎదుర్కొన్నవన్నీ కరోనా లక్షణాలతో మ్యాచ్ అయ్యాయని.. అయితే..అతడికి ఫారిన్ ట్రావెల్ హిస్టరీ లేదని చెప్పటంతో.. పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆసుపత్రి నుంచి ఫోన్ రావటంతో.. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో వెళ్లి మరణించిన వ్యక్తిని గాంధీకి తరలించి.. పరీక్షలు జరిపారు.
అనూహ్యంగా సదరు వ్యక్తి కరోనాతో మరణించినట్లు గుర్తించారు.ఒక్కసారి ఉలిక్కిపడిన తెలంగాణ ప్రభుత్వం, అతడి ట్రావెల్ హిస్టరీ మీద ఆరా తీసిందట. ఈ నెల 13-15 మధ్యన ఢిల్లీలోని నిజాముద్దీలో భారీ ఎత్తున మర్కజ్ ప్రార్థనలు జరిగినట్లుగా గుర్తించారు. దీనికి మొత్తం 75 దేశాల నుంచి ఎనిమిదివేల మంది వరకూ హాజరైనట్లుగా గుర్తించారు. ఇండోనేషియా.. మలేషియా.. సౌదీ.. కజకిస్థాన్ ఇలా చాలా దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఇలా హాజరైన విదేశీయుల సంఖ్య ఏకంగా రెండు వేలుగా చెబుతున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలనుంచి భారీగానే ఉన్నారట. అయితే అక్కడ ప్రార్థనలు ముగిసిన తర్వాత కూడా పలువురు ప్రార్థనలు నిర్వహించిన వేదిక దగ్గర్లోనే బస చేశారని.. ఆరు అంతస్తుల డార్మటరీల్లో 280 మంది విదేశీయులు ఉన్నట్లుగా తేలింది. అక్కడున్న మొత్తం 300 మందికి కొవిడ్ 19 లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 175 మందికి పరీక్షలు నిర్వహించగా పలువురికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. అనారోగ్యంగా ఉన్న 75 మందిని ఆదివారమే ఢిల్లీలో గుర్తించారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మౌలానాపై కేసు నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించి..ఒకేచోట వందల మంది ఎలా ఉన్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
అంతేకాదు, ఈ ప్రార్థనలు జరిగిన స్థలం నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ ను అనుకునే ఉంది. ఇప్పుడీ చుట్టుపక్కల ప్రాంతాల్ని చుట్టుముట్టిన పోలీసులు, ప్రతి ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ 200 మందిని ఐసోలేషన్ వార్డులకు తరలించారు. ప్రాధమికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రార్థనలకు తెలంగాణ నుంచి దగ్గర దగ్గర 300 మంది హాజరైతే, ఏపీ నుంచి దగ్గర దగ్గర 500 మంది పైనే హాజరైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకూ ఉన్న అంచనాలు మారిపోయి.. కొత్త ఆందోళన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు మొదలైంది. ఈ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు.. గడిచిన కొద్ది రోజులుగా ఎక్కడెక్కడ సంచరించారు,అసలు ఎంతమంది వంటి లెక్కలు తీస్తున్నారు.