central govt serious on coronavirus rumors
కరోనా వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉన్నా దాని కన్నా ప్రమాదకరంగా అవాస్తవ వార్తలు పుకార్లు తీవ్రమయ్యాయని వాటితోప్రజల్లో భయాందోళన రేకెత్తుతున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తూ, రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. అవాస్తవ వార్తలను నియంత్రించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు కొనసాగింపుగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా దేశంలోని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. కరోనా అక్కడొచ్చింది.. ఇక్కడొచ్చింది.. అని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం అవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందే పరిస్థితులు వస్తున్నందున కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మళ్లీ తప్పుడు వార్తలపై హెచ్చరికలు జారీ చేసింది.
తప్పుడు సమాచారం వ్యాప్తి వారిపై మరింత కఠినంగా ఉండాలని స్పష్టం చేసింది. అవాస్తవ వార్తలపై చర్యలు తీసుకోవాలని తెలిపింది. అందులో భాగంగా పలు సూచనలు చేస్తూ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు హోం శాఖ లేఖ రాసింది. త్వరలోనే వాస్తవాల తో ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా ప్రకటించింది. అవాస్తవ వార్తలతో పోరాడేందుకు ఆ వార్తలు విరివిగా ప్రచారంలోకి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలు వాస్తవాలను తెలుసుకోకుండా.. ధ్రువీకరించుకుండా ప్రచారంలోకి వస్తున్న వార్తల్లో వాస్తవాలను తెలియపరిచేందుకు భారత ప్రభుత్వం వెబ్ పోర్టల్ను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. అవాస్తవ వార్తలకు వివరణలను ఇచ్చేందుకు వాటికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఇలాంటి వ్యవస్థలనే ఏర్పాటు చేసుకోవాలని కూడా సూచించారు. లాక్డౌన్ కరోనా కట్టడి విషయంలో కూడా కొన్ని సూచనలు చేసింది.