Chadalawada Srinivasa Rao has donated 10 Laksh to Telugu Film Producers Council
మహమ్మారి కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచం కుదేలవుతోంది. అన్ని దేశాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. ఇక మన దేశం లో లాక్ డౌన్ విధించడంతో మొత్తం స్తంభించి పోయింది. ఇక సినిమా షూటింగ్ లు,హాళ్లు మూసివేయడంతో చిత్ర పరిశ్రమలో పనులు కూడా ఆగిపోయాయి. ఫలితంగా చాలా మంది నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే పేద కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటి మనకోసం’ అనే సంస్థ స్థాపించారు. ఆ సంస్థకు తను విరాళం ఇవ్వడమే కాకుండా ఇతర నటీనటులు కూడా ఇచ్చేలా స్ఫూర్తి నింపి, వచ్చిన విరాళాలతో పేద కార్మికులను ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నిత్యావసర సరుకులు కూడా కార్మికులకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.ఇలాంటి పరిస్థితులలో చేతిలో ఉన్న సొమ్మంతా సినిమాలకు పెట్టి ఇబ్బందులు పడుతున్న నిర్మాతలను ఆదుకునేందుకు తనవంతుగా నిర్మాతల మండలికి సాయం అందించడానికి కొందరు ప్రొడ్యూసర్స్ ముందుకొస్తున్నారు.
నిర్మాతల మండలికి ఆపన్న హస్తం అందించేందుకు సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ముందుకు వచ్చారు. ఆయన తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి రూ. 10,11,111 విరాళం అందించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిర్మాతల కోసం ఈ మొత్తం ఉపయోగించాలని కోరారు. అవసరమైతే మరోసారి కూడా తాను సాయం చేస్తానని తెలిపారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఈ డబ్బును నిర్మాతలు తుమ్మల ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్లకు అందజేశారు. ఇంతకీ చదలవాడ సినిమా ఏమిటంటే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించిన బిచ్చగాడు.