ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలను 66వ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించారు. కానీ ఈ సారి కరోనా మహమ్మారి వల్ల ఎక్కువ ఆర్భాటం లేకుండా చేయునున్నట్లు ఉత్సవ కమిటి సభ్యులు తెలిపారు. అలాగే ప్రతి ఏటా ఉత్సవ మూర్తిని 60 అడుగులకు పైగా నిలబెడుతూ వస్తున్నారు. ఈ సారి కూడా అలా భారీ గణేశుడిని పెడితే చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అలాగే ఉత్సవాలను ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి రోజు కర్ర పూజ నిర్వహించి ప్రారంభించే పనులను ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. కర్రపూజలో పాల్గొనే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వినాయకుడి తయారీ, ఎత్తు విషయంలో పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాతే ముందుకు వెళతామని ఉత్సవ కమిటీ సభ్యులు ఈ సందర్బంగా తెలిపారు.
ఇది కూడా చదవండి: తెరుచుకున్న కేదార్నాథ్ తలుపులు