40 ఏళ్ళ వయసులో భారత యువ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్గాంధీ బహుశా ప్రపంచంలోనే అతి పిన్నవయస్కులైన ప్రభుత్వాధినేతల్లో ఒకరు కావచ్చు. ఆయన తల్లి ఇందిరాగాంధీ 1966లో మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఆమె రాజీవ్ గాంధీ కంటె 8 ఏళ్ళు పెద్ద. ప్రఖ్యాతివహించిన ఆయన తాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వేచ్ఛా భారతానికి తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేనాటికి వయసు 58 సంవత్సరాలు.
దేశంలో తరం మార్పుకు సంకేతంగా రాజీవ్గాంధీ దేశ చరిత్రలోనే అతిపెద్ద మెజార్టీ సాధించారు. హత్యకు గురైన తన తల్లి అంత్యక్రియలు పూర్తికాగానే ఆయన లోక్సభ ఎన్నికలకు ఆదేశించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు 7 సార్లు జరిగిన ఎన్నికలలో కంటే అత్యధిక ఓట్లను సాధించింది. 508 లోక్సభ సీట్లలో రికార్డుస్థాయిలో 401 సీట్లు గెలుచుకుంది.
7 కోట్ల మంది భారతీయులకు నాయకునిగా అటువంటి శుభారంభం చేయడం అది ఎటువంటి పరిస్థితి అయినా చెప్పుకోదగిందే. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాజీవ్గాంధీ పూర్తిగా రాజకీయ కుటుంబానికి చెందినవారు అయినప్పటికీ ఆలస్యంగా, అయిష్టంగా రాజకీయాల్లో ప్రవేశించి కూడా ఇంత పెద్ద మెజార్టీ సాధించడం, స్వాతంత్ర ఉద్యమంలోను, ఆ తరువాత 4 తరాలపాటు భారతదేశానికి సేవలు అందించిన రాజకీయ కుటుంబానికి చెందిన రాజీవ్గాంధీ అనివార్య పరిస్థితుల్లోనే రాజకీయ ప్రవేశం చేశారు.
రాజీవ్గాంధీ 1944 ఆగస్టు 20 బోంబేలో జన్మించారు. భారతదేశం స్వాతంత్య్రం సాధించేనాటికి ఆయన తాత ప్రధానమంత్రి అయ్యేనాటికి రాజీవ్ వయసు కేవలం 3 సంవత్సరాలు. ఆయన తల్లిదండ్రులు లక్నో నుంచి ఢిల్లీకి మకాం మార్చారు. తండ్రి ఫిరోజ్ గాంధీ పార్లమెంటు సభ్యుడు అయ్యారు. నిర్భయంగా కష్టపడి పనిచేసే పార్లమెంటేరియన్గా పేరు తెచ్చుకున్నారు.
రాజీవ్గాంధీ తన బాల్యాన్ని తాతగారితో కలసి తీన్మూర్తి హౌస్లో గడిపారు. అక్కడ ఇంధిరాగాంధీ ప్రధానమంత్రి సహాయకురాలిగా పనిచేశారు. డెహ్రాడూన్లోని వెల్హామ్ ప్రెప్ స్కూల్కు కొద్దికాలంపాటు వెళ్ళిన రాజీవ్గాంధీ తరువాత రెసిడెన్షియల్ డూన్ స్కూల్కు మారారు. అక్కడ ఆయన అనేక మందితో ప్రగాఢ మైత్రిని పెంపొందించుకున్నారు. చిన్నతమ్ముడు సంజయ్గాంధీ కూడా ఆయనతో కలిశారు.
స్కూల్ చదువు పూర్తయిన తరువాత రాజీవ్గాంధీ కేంబ్రిడ్జి ట్రినిటీ కళాశాలలో చేరారు. అయితే త్వరలోనే లండన్లోని ఇంపీరియల్ కాలేజ్కి మారారు. అక్కడ మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సు చేశారు. రాజకీయాలను జీవిత వ్యాపకంగా మలచుకోవాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఆసక్తి కూడా చూపలేదు. సైన్సు, ఇంజినీరింగ్కు సంబంధించిన అనేక ఉద్గ్రంధాలు ఆయన బీరువాల నిండా ఉండేవని రాజీవ్ సహ విద్యార్థలు చెబుతారు. ఫిలాసఫీ, రాజకీయాలు లేదా చరిత్ర గురంచి ఆయన పట్టించుకునేవారు కాదు.
అయితే సంగీతాన్ని ఇష్టపడేవారు. వెస్ట్రన్, హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంతోపాటు ఆధునిక సంగీతాన్ని కూడా ఇష్టపడేవారు. రాజీవ్ ఆసక్తి కనబబరిచే ఇతర అంశాల్లో ఫొటోగ్రఫీ, అమెచ్యూర్ రేడియో ముఖ్యమైనవి. కాగా, రాజీవ్కు అత్యంత ఇష్టమైనవి గాల్లో ప్రయాణించడం. ఇంగ్లండ్ నుంచి తిరిగివచ్చిన వెంటనే ఢిల్లీ ఫ్లైయింగ్ క్లబ్ ఎంట్రన్స్ పరీక్ష పాసై కమర్షియల్ పైలెట్ లైసెన్సు తీసుకోవడానికి వెళ్ళారు. అనతికాలంలోనే దేశీ విమాన సంస్థ ఇండియన్ ఎయిర్లైన్స్ లో పైలెట్ జీవితం ప్రారంభించారు.
కేంబ్రిడ్జ్ లో ఉన్న సమయంలో ఇంగ్లీష్ చదివే ఇటాలియన్ మహిళ సోనియా మైనోతో ఆయనకు పరిచయమయింది. 1968లో ఢిల్లీలో వారు ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు రాహుల్, ప్రియాంకతో కలసి వారు ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంట్లో నివాసం ఉన్నారు. చుట్టూ రాజకీయ కోలాహలం ఉన్నప్పటికీ వారిది మాత్రం పూర్తిగా వ్యక్తిగత జీవితం.
కానీ, 1980లో సోదరుడు సంజయ్గాంధీ విమాన ప్రమాదంలో మరణించడంతో పరిస్థితి మారింది. అప్పట్లో అంతర్గతంగా, బహిర్గతంగా అనేక సవాళ్ళు చుట్టుముట్టిన పరిస్థితుల్లో తల్లికి చేయూతను ఇవ్వడానికి రాజకీయాల్లో చేరవలసిందిగా రాజీవ్గాంధీపై వత్తిడి పెరిగింది. మొదట్లో వీటిని ప్రతిఘటించినప్పటికీ తరువాత తల వొగ్గక తప్పలేదు. తమ్ముని మృతి కారణంగా ఉత్తరప్రదేశ్లోని అమేథీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో రాజీవ్గాంధీ గెలుపొందారు.
1982 నవంబర్లో భారత్ ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చినపుడు అంతకు చాలా సంవత్సరాల ముందు జరిగిన ఒప్పందానికి కట్టుబడి స్టేడియంలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించే కార్యక్రమాన్ని రాజీవ్గాంధీ విజయవంతంగా పూర్తిచేశారు. వీటి పని సకాలంలో పూర్తయ్యేలా చూసే బాధ్యతను రాజీవ్గాంధీకి అప్పగించారు. ఈ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేయడం ద్వారా రాజీవ్గాంధీ తన సామర్థ్యాన్ని, సమన్వయ స్ఫూర్తిని చాటుకున్నారు.
ఇది కూడా చదవండి: మాతృమూర్తికి వందనం
అదే సమయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియను తన భుజస్కందాలపై వేసుకున్నారు. ఆ తరువాత కాలంలో అనేక పరీక్షా సమయాల్లో రాజీవ్గాంధీ శక్తి సామర్థ్యాలు, ప్రజ్ఞాపాటవాలు బయటపడుతూ వచ్చాయి. 1984 అక్టోబర్ 31న తల్లి ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురైన సమయంలో ప్రధానమంత్రిగాను, కాంగ్రెస్ అధ్యక్షునిగాను ఆయన నిర్వర్తించాల్సి వచ్చింది. వ్యక్తిగత దుఃఖాన్ని, విచారాన్ని అణచుకొని జాతీయ బాధ్యతను ఎంతో హుందాగా, ఓర్పుగా తన భుజాలకు ఎత్తుకున్నారు.
అది 1991 మే 21న రాత్రి పది గంటల 21 నిమిషాలు. స్థలం తమిళనాడులోని శ్రీపెరంబదూర్. ఒక యువతి ఒక గంధపు మాల తీసుకుని అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వైపు కదిలింది. ఆమె ఆయన పాదాలను తాకేందుకు వంగగానే, చెవులు పగిలిపోయేలా ఒక పేలుడు సంభవించింది. అయితే బాంబు పేలడానికి ముందు చిటపటమని టపాసులు పేలిన శబ్దం వచ్చింది, వెంటనే నిశ్శబ్దం ఏర్పడింది. తర్వాత భారీ శబ్దంతో బాంబు పేలింది.
శ్రీపెరంబదూర్లో ఆ భయంకర పేలుడు సమయంలో తమిళనాడు కాంగ్రెస్ నేతలు మూపనార్, జయంతి నటరాజన్, రామమూర్తి అక్కడ ఉన్నారు. పొగలు అలముకోవడంతో రాజీవ్ గాంధీ కోసం వెతకడం ప్రారంభించారు. ఆయన శరీరంలో ఒక భాగం, సగం తల కనిపించింది. ఆయన కపాలం ఛిద్రమైంది. దాని నుంచి బయటికొచ్చిన మెదడు, ఆయన సెక్యూరిటీ అధికారి పీకే గుప్తా కాళ్లపై పడి ఉంది.
ఇక రాజీవ్ చూడడానికి వచ్చిన జనాల్లో చాలా మంది నల్లటి మాంసపు ముద్దల్లా మారిపోయారు. ఆ రోజు అందరి శరీరాలు మాంసం ముక్కలుగా మారాయి. రాజీవ్ సెక్యూరిటీ అధికారి ప్రదీప్ గుప్తా కాసేపు బతికినా తర్వాత ప్రాణాలు వదిలారు. తర్వాత కొందరికి రాజీవ్ గాంధీ శరీరం కనిపించింది. ఆయన లోటో బూట్లు, తర్వాత తెగిపడిన చేయి, దానికి ఉండే గుచ్చీ వాచ్ చూసి ఆ భాగాలన్నీ రాజీవ్ గాంధీవేనని నిర్ధారించకున్నారు.