ఈమధ్య బాలీవుడ్ భామలు పలు అంశాలపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ ఫైర్ అయింది. విద్యావంతులే విడాకుల వైపు మొగ్గుచూపుతున్నారన్న ఆయన వ్యాఖలపై ఆమె మండిపడింది . ఇలాంటి తెలివి తక్కువ మాటలు ఎలా మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
వివరాల్లోకి వెళ్తే, ఆదివారం అహ్మదాబాద్లో జరిగిన ఓ కార్యక్రమానికి మోహన్ భగవత్ హాజరై మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుల కుటుంబాల్లోనే ఎక్కువగా విడాకుల కేసులు నమోదవుతున్నాయన్నారు.
చిన్న చిన్న విషయాలకే కొట్లాడుకుంటూ విడిపోతున్నారని విమర్శించారు. ‘ఈరోజుల్లో విడాకుల కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అర్థంపర్థంలేని విషయాల కోసం విడాకుల దాకా వెళ్తున్నారు’అని అన్నారు.
“ముఖ్యంగా బాగా చదువుకున్న వాళ్లు, ఐశ్వర్యవంతులైన వారే విడాకులు తీసుకుంటున్నారు. విద్య, డబ్బుతో పొగరుబట్టిన కారణంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. దాంతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. సమాజంలో కూడా అంతరాలు పెరిగిపోతున్నాయి’’అని మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సోనం కపూర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ,‘‘ఈ మనిషి.. అసలు ఇలా ఎలా మాట్లాడతారు? ఇవి పూర్తిగా తెలివితక్కువ, వెనుకబాటుతనాన్ని సూచించే మాటలు’’ అంటూ ఫైర్ అయింది.