subramanian swamy tweeted Article 360 :
చైనా నుంచి మొదలై ప్రపంచమంతటా విస్తరించి, ప్రాణాంతక మహమ్మారి గా మారిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. ఇది ఎటు పౌతుందో తెలీయని దుస్థితి నెలకొంది. ముఖ్యంగా అతలాకుతలం అవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు కేంద్రం ఆర్థిక ఎమెర్జెన్సీ ప్రకటిస్తుందా అనే సందేహం వస్తోంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి అవకాశం కల్పించే ఆర్టికల్ 360ని ఆశ్రయించడమే మార్గమని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లు దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఊహాగానా లొస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గానీ, ప్రభుత్వ అధికారులు గానీ ఎవరూ ఇప్పటి వరకు ఆర్టికల్ 360 ఊసెత్తకపోయినప్పటికీ కొందరు నేతల వ్యాఖ్యలతో దీనిపై విశేష ఆసక్తి నెలకొంది.
ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ) విధించేందుకు రాష్ట్రపతికి అధికారమిచ్చే చట్టమే ఆర్టికల్ 360. దీనివలన రాష్ట్రాలు తమ ఆర్ధిక వనరులను ఎలా ఉపయోగించాలో ఆదేశించే అధికారం కేంద్రానికి లభిస్తుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించేందుకు కూడా కేంద్రానికి అధికారం వచ్చేస్తుంది. ‘‘దేశ ఆర్ధిక వ్యవస్థ స్థిరత్వానికి, లేదా దేశంలోని ఏదైనా ప్రాంతానికి చెందిన ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి ఉందని రాష్ట్రపతి భావిస్తే, అధికారిక ప్రకటన ద్వారా ఆయన దీన్ని అమల్లోకి తేవచ్చు’’ అని ఈ చట్టంలోని 1వ ప్రకరణం చెబుతోందట. ఒక వేళ ఆర్టికల్ 360ని అమల్లోకి తీసుకొస్తే ఆ తర్వాతి రెండు నెలల వరకు లేదా రాష్ట్రపతి దీన్ని రద్దు చేసినట్టు ప్రకటించే వరకు చెల్లుబాటు లో ఉంటుంది. 2 నెలలకు మించి పొడిగిస్తే, దీన్ని పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించాలి.
ప్రత్యేకించి బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణియన్ స్వామి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలతో ఇది ఒక్కసారిగా తెరమీదికి వచ్చింది. ‘‘ఇక ఇప్పుడు దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించడం అనివార్యమా? ప్రభుత్వం దీనిపై సందేహాలను నివృత్తి చేయాలి..’’ అని స్వామి ఇటీవల ట్వీట్ చేశారు. స్వామి మాటలు అటుంచితే, భారత సెక్యురిటీ మార్కెట్లు ఇవాళ ఘోరంగా పతనం కావడంతో ఇక ఆర్టికల్ 360 విధించడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎన్నడూ లేని విధంగా సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 3,934 పాయింట్లు పతనమైంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 25,981 వద్ద క్లోజ్ అయ్యింది. డాలర్తో పోల్చితే రూపాయి విలువ సైతం 76 పైసలకు పడిపోయింది. ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ తీవ్ర ప్రతికూల ప్రభావం దీనికి కారణం.