రాజధాని తరలింపు – అమరావతి రైతుల సమస్యలపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఏపీ హైపవర్ కమిటీ తాజాగా మూడోసారి సమావేశం అయింది. ఇప్పటికే మూడు దఫాలుగా సమావేశమైన కమిటీ సభ్యులు ఆ సమావేశాల్లో చర్చించిన అంశాలను సీఎం వైఎస్ జగన్ కు వివరించారు. హైపవర్ కమిటీ తొలి సమావేశంలో జీఎన్ రావు కమిటీ – బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఇచ్చిన నివేదికలపై చర్చించింది. రెండో సమావేశంలో రాజధాని రైతుల ఆందోళన – రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలి – సచివాలయం ఉద్యోగుల సమస్యలపై చర్చించింది. ఇక మూడో సమావేశంలో అన్ని జిల్లాల అభివృద్ధిపై చర్చించారు.
రాజధాని తరలింపు ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పటిలోగా పూర్తి చేయాలనే అంశంపైనా తాజా భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. అమరావతి రైతుల సమస్యలు – వారు లేవనెత్తిన అభ్యంతరాలకు పరిష్కారం – రాజధాని తరలింపు అనంతరం ఉద్యోగులకు విశాఖలో సౌకర్యాలు వంటి అంశాలపై చర్చించారు.
రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్న అమరావతి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సరైన ప్రత్యామ్నాయాలు ఏంటి అనే అంశాలను ముఖ్యమంత్రి జగన్ కు ఈ సమావేశంలో హైపవర్ కమిటీ సభ్యులు వివరించారట.పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు టాక్. శనివారం మరోసారి సమావేశం కానుంది. కమిటీ తుది నివేదికకు రూపకల్పన చేసి.. రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. ఈ నెల 20న దీనిపై కేబినెట్ లో చర్చించి.. తర్వాత అసెంబ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్దే తమ ప్రభుత్వం ధ్యేయం అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.