vijayashanthi controversial comments over CM KCR
కేసీఆర్ పెట్టిన శాపం గురించి తెలియకే గాంధీ ఆస్పత్రిపై ఒవైసీ విమర్శలు చేసివుంటారని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై పోరులో అందరూ ప్రభుత్వానికి బాసటగా నిలవాలని సీఎం కేసీఆర్ ఇటీవల విలేకరుల సమావేశంలో కోరారు. అంతటితో ఆగకుండా గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేవని రాసిన మీడియా యజమానికి కరోనా వైరస్ సోకాలని శాపం పెట్టారు. కానీ రెండు రోజుల క్రితం ఎంఐఎం శాసనసభ సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీకి కరోనా వైరస్ బాధితులకు వైద్యం అందిస్తున్న గాంధీ ఆసుపత్రి జైలు మాదిరిగా ఉందని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై విజయశాంతి ఫేస్బుక్లో వ్యంగ్యంగా స్పందించారు.
కరోనా పాజిటివ్ కేసులుగా నిర్ధారణ అయిన వారికి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న తీరుపై ఎంఐఎం శాసనసభ సభ్యుడు అక్బరుద్దీన్ గారు చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది. ప్రపంచమంతా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న తరుణంలో కొన్ని లోపాలున్నా వాటిని పట్టించుకోకుండా అందరూ ప్రభుత్వానికి బాసటగా నిలవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఈ మధ్య ప్రెస్ మీట్లో స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేవని రాసిన కారణంగా ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారికి కరోనా రావాలని కెసిఆర్ గారు శాపం పెట్టారు. వైద్య సదుపాయాలు లేవు అన్నందుకే కరోనా రావాలన్న కేసీఆర్ గారు మరి గాంధీ ఆసుపత్రి జైలు మాదిరిగా ఉందని విమర్శించిన అక్బరుద్దీన్ గారిపై ఎలాంటి శాపనార్థాలు పెడతారోననీ తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు. గాంధీ ఆసుపత్రి జైలు లాగా ఉందని విమర్శించిన అక్బరుద్దీన్ గారికి బహుశా కెసిఆర్ గారు పెట్టిన శాపం గురించి తెలిసి ఉండకపోవచ్చు. లేదా కెసిఆర్ గారు తాను ఒకటే కనుక ఈ శాపాలు తనకు వర్తించవని అక్బరుద్దీన్ గారిలో ధీమా ఉండి ఉండొచ్చు లేదా మాకు ఈ శాపాలు తగలవని తాము అన్నిటికీ అతీతమని అక్బరుద్దీన్ గారు భావించి ఉండొచ్చు. మరి రాబోయే రోజుల్లో అక్బరుద్దీన్ కామెంట్స్ పై కెసిఆర్ గారు శాపం పెడతారా? లేక చూసీ చూడకుండా సర్దుకుపోతారా? అనే విషయాన్ని వేచి చూడాలి. అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.