టిడిపి నాయకుడు,ఎమ్మెల్సీ నారా లోకేష్ తమ కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ‘అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు. హడావుడిగా ఆస్తులను ప్రకటించడం వెనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయి .చంద్రబాబు ప్రకటించిన ఆస్తులన్నీ డుప్లికేటే. ఐటీ విచారణలో నిజాలు బయటపడుతున్నాయనే కారణంతో ఆస్తులు ప్రకటించారు’అని ఆయన విమర్శించారు.
‘చంద్రబాబు పీఎస్ ఇంట్లోనే దాడులు చేస్తే.. రూ.2వేల కోట్ల అక్రమ లావాదేవీలు బయటపడ్డాయి. 7 లక్షల కోట్ల అవినీతికి చంద్రబాబు పాల్పడ్డారు. విదేశాల్లో ఉన్న ఆయన బినామీ ఆస్తులు బయటపెట్టాలి’ అని శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు చెప్పేవనీ శ్రీరంగనీతులని, చేసేవన్నీ తప్పుడు పనులని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు 100 తప్పులపై బీజేపీ ఛార్జ్షీట్ కూడా వేసిందని,చంద్రబాబు అవినీతి సామ్రాట్ అని వామపక్షాలు పుస్తకం కూడా ముద్రించాయని, అక్రమ ఆస్తులపై లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్పై చంద్రబాబు స్టే తెచ్చుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. అమరావతి నుంచి అహ్మద్ పటేల్ వరకు జరిగిన హవాలాపై నిప్పునాయుడు ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు.
కాంగ్రెస్కు 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఎంత కప్పం కట్టారో బయటపడుతోందని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికి, కేసుల కోసమే చంద్రబాబు రాష్ట్ర విభజనకు సహకరించారని ఆయన ఆరోపించారు. ‘పొత్తులు లేకుండా చంద్రబాబు ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు. ఆయన చేసిన అవినీతికి దేవుడు కూడా కాపాడలేడు. భవిష్యత్తులో చంద్రబాబు జైలుకెళ్లక తప్పదు. రాష్ట్ర ఇమేజ్ను దెబ్బతీసేందుకు చంద్రబాబు ఒక మాఫియా సృష్టించారు. ప్రతి నెలా రూ.5కోట్లు పెట్టి మాఫియా నడిపిస్తున్నారు’ అని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. త్వరలోనే ఆ మాఫియా వివరాలు బయటపెడతామన్నారు. చంద్రబాబు బినామీలను కాపాడుకోడానికి జనచైతన్య యాత్ర పేరుతొ యాత్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు.